మ‌హారాష్ట్ర‌లో ప‌ని మొద‌లు పెట్టేసిన‌ కేసీఆర్.. తాజాగా హాట్ కామెంట్స్‌

Update: 2023-07-09 09:17 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మ‌హారాష్ట్ర‌లో ప‌ని ప్రారంభించేశారు. ఇప్ప‌టికే ఇటీవ‌ల ఆయ‌న భారీగా వంద‌ల వాహ‌నాల కాన్వాయ్‌తో ఆ రాష్ట్రానికి వెళ్లి హ‌ల్చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలో కింద‌రు ఎన్సీపీ(మ‌హారాష్ట్ర ప్ర‌తిప‌క్షం) నేత‌ల‌ను కూడా ఆయ‌న బీఆర్ ఎస్‌లో చేర్చేసుకున్నారు. తాజాగా మ‌రికొంద‌రిని హైద‌రాబాద్‌కు ఆహ్వానించి(ఖ‌ర్చులు పెట్టుకుని మ‌రీ) వారిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. శ‌నివారం బాగా పొద్దు పోయాక ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ చేరిక కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్ష పార్టీల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌ద‌వుల కోసం పార్టీలు చీలుస్తున్నార‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్సీపీ చీలిక‌, అజిత్ ప‌వార్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టడాన్ని త‌ప్పుబ‌ట్టారు. దేశ రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని  ఆవేదన వ్యక్తం చేశారు. పదవులకోసం సొంత పార్టీలనే చీల్చుకుంటూ వేరే పార్టీలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఘటనలు దేశ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.

ఇలా చేస్తే.. అభివృద్ధి నిరోధకులుగా మారుతార‌ని, ఇలాంటి వారిని ప్ర‌జ‌లు గెలిపించుకుంటూ కనీస వసతులు లేకుండా ఇంకెన్నాళ్లు ఉంటార‌ని మహారాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ ప్రశ్నించారు.  బీఆర్ ఎస్‌ రూపంలో అభివృద్ధి మీ ఇంటి వద్దకు వచ్చిందని.. తలుపులు తెరిచి ఆహ్వానించాలని మ‌హా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదో చూద్దామని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

బీఆర్ ఎస్‌ను మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్‌ సహా దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోలాపూర్‌లో త్వరలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయ‌న‌ ప్రకటించారు. అనంత‌రం  మహారాష్ట్రకు చెందిన పలువురు రాజ‌కీయ నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరారు. తెలంగాణ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన పొరుగు రాష్ట్రం నేతలను సీఎం సాదరంగా ఆహ్వానించారు. వారికి శ‌నివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉద‌యం మ‌రోసారి భేటీ అయి.. రాష్ట్ర రాజ‌కీయాల‌పై చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు.

Similar News